
అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన సేవా
కార్యక్రమాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాటి వారికి వీలైనంత
చేయూత అందించాలనే స్పూర్తిని కలిగిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ ద్వారా
కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆమె, మారుమూల గ్రామాలకు సైతం
వైద్య సేవలు అందేలా కృషి చేశారు. పర్యావరణం, వైల్డ్ లైఫ్ వంటి
విషయాల్లోనూ ఉపాసన ఛారిటీలు చేస్తుంటారు.

ఆమె దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా
నిలబడేందుకు ముందుకొచ్చారు. అక్కడ ఉంటున్న వృద్ధులకు మందులు, ఆహార
పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అపోలో
ఫౌండేషన్ లో భాగమైన బిలియన్ హార్ట్స్ బీటింగ్ కార్యక్రమం ద్వారా ఆమె
ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 150
వృద్ధాశ్రమాలకు చేయూత అందిస్తున్నారు. తాజాగా వృద్ధాశ్రమంలో ఆమె సీనియర్
సిటిజన్స్ తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వాళ్లతో ముచ్చటిస్తూ
ఆనందాన్ని పంచారు. ఉపాసన తమ దగ్గరకు వచ్చి మాట్లాడటంతో ఆ వృద్ధులంతా
సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న సేవా
కార్యక్రమాలకు అభిమానులతో సహా నెటిజన్స్ హ్యాట్సాఫ్ అంటున్నారు.