
అలనాటి అందాల నటి, తమిళ రాజకీయ సంచలనం, అభిమానులు, ప్రజలు తలైవి అని పిలుచుకునే జయలలిత గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలివుడ్ నటి కంగనా రనౌత్ జయలలిత పాత్రను పోషిస్తున్నారు. తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ సింగ్ కలిసి నిర్మిస్తున్నారు. తమిళుల ఆరాధ్య దైవం ఎమ్.జి.ఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తున్నారు. నాజర్, భాగ్యశ్రీ, సముధ్రఖని, మధుబాల తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. నటిగా ఆమె ఎలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది, ఆమెకు ఎమ్.జి.ఆర్ తో మైత్రి ఎలా ఏర్పడింది, ఆమె రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది, ఆమె రాజకీయ రంగ ప్రవేశం వెనుక ఎమ్.జి.ఆర్ పాత్ర ఏమిటి ఇలాంటి విషయాలను చర్చిస్తూ... ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమెకు ఎదురైన సంఘటనలు, ఆమె వాటిని ఎలా ఎదురుకుందో క్లుప్తంగా తెలియజేసారు.

ఇందులో జయలలితగా కంగనా అద్భుతంగా నటించారు. నటిగా ఉన్నప్పటి నుండి రాజకీయాల్లోకి వచ్చాక ఎలా ఉండే వారో అచ్చం అలానే తనని తాను మలచుకున్నారు. ఆమె హావాభావాలు, ఆమె బాడి లాంగ్వేజ్ జలలితని జ్ఞప్తికి తెచ్చాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు.