ఇండియన్ పనోరమాలో 'స్రవంతి' రవికిశోర్ తొలి తమిళ సినిమా 'కిడ'కు స్టాండింగ్ ఒవేషన్!!

ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ'. గోవాలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ పనోరమాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. థియేటర్లో ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది.
'కిడ'లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో 'స్రవంతి' రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''నేను చెన్నై వెళ్ళినప్పుడు ఓ స్నేహితుడిని కలిశా. తానొక కథ విన్నానని, అద్భుతంగా ఉందని చెప్పారు. కథ ఏంటి? అని అడిగా. ఐదు నిమిషాల పాటు కథ చెప్పారు. వినగానే కనెక్ట్ అయ్యాను. సరేనని స్క్రిప్ట్, డైరెక్టర్ నేరేషన్ వాయిస్ పంపించామని అడిగా. కథ మొత్తం విన్నాను. బావుంటుందని వెంటనే ఓకే చెప్పా. దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్ట్ ఏదైతే రాశాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. అందుకే, ఇవాళ ఇన్ని ప్రశంసలు లభిస్తున్నాయి. మా స్రవంతి సంస్థలో ఇది తొలి తమిళ సినిమా. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే సబ్ టైటిల్స్ తో కూడా చూస్తారు. అందుకనే, తమిళంలో తీశా. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని అన్నారు ‌.
చిత్ర దర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ ''మా చిత్రానికి ఇంత అరుదైన గౌరవం లభించడం సంతోషంగా ఉంది. మదురైకి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో సినిమా తీశాం. తాతయ్య, మనవడు, ఓ మేకపిల్ల ఇందులో ముఖ్య పాత్రలు పోషించాయి. ఆ ముగ్గురి మధ్య ఎమోషన్స్ కీలకం. పనోరమాలో షో వేసినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చూశారు. నేను యంగ్ జనరేషన్ కి ఈ సినిమా కనెక్ట్ అవ్వరని అనుకున్నా. కానీ, వాళ్ళు సీన్ టు సీన్ చెబుతుంటే సంతోషంగా ఉంది. నేను మా అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగాను. తమిళనాడులో దీపావళి ఘనంగా సెలబ్రేట్ చేస్తాం. నా బాల్యంలో జరిగిన సంఘటనల స్పూర్తితో తీశాం. ఈ రోజు సినిమా ఈ స్థాయికి వచ్చిందంటే కారణం మా నిర్మాత స్రవంతి రవికిశోర్ గారు. నా తొలి సినిమాకు అటువంటి నిర్మాత లభించడం అదృష్టం. నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏ రోజూ ఆయన సెట్ కి రాలేదు. కానీ, నాకు ఏం కావాలో అది సమకూర్చారు. ఆయనకు చాలా థాంక్స్'' అని అన్నారు.
ఈ చిత్రానికి దాదాపుగా అందరూ కొత్తవాళ్ళు పని చేశారు. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు... ఇలా చాలా మందికి తొలి చిత్రమిది.
పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : ఏకదేసి, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.