
ఐపీఎల్ మ్యాచుల వల్ల కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి మ్యాచ్ ఆరంభానికి ముందే బయో బబుల్ వాతావరణం సృష్టించి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, కోచింగ్ సిబ్బంది, సహాయ సిబ్బందిని అందులో ఉంచింది. వీళ్లందరికీ నాలుగు రోజులకోసారి కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్లిన కింగ్స్ లెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా కూడా తాజాగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. కరోనా టెస్టు కోసం శాంపిళ్లను సేకరిస్తున్న ఓ వీడియోను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “ఇప్పటి వరకూ నేను 20 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నాను. నేనిప్పుడు కోవిడ్ టెస్ట్ క్వీన్ ని అయిపోయా. నా దగ్గర టెస్ట్ శాంపిళ్లు సేకరిస్తున్న వైద్య బృందానికి ఎంతో ఓపిక ఉంది. వాళ్లను మెచ్చుకోకుండా అస్సలు ఉండలేకపోతున్నా” అంటూ ఆమె పేర్కొన్నారు. “చాలా మంది బయో బబుల్ అంటే ఏంటని నన్ను అడుగుతున్నారు. బయో బబుల్ అంటే...పూర్తిగా శానిటైజ్ చేసిన ప్రాంతం.క్వారంటైన్ పూర్తి చేసుకొని కరోనా టెస్టులో నెగటివ్ అని తేలితేనే బయో బబుల్లోకి ప్రవేశం ఉంటుంది. బయటి వాళ్లతో కాంటాక్ట్ అయ్యే వీలుండదు. ఫలితంగా కోవిడ్ బారిన పడే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటగాళ్లు సిబ్బంది ప్రయాణించినా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరు రోజుల క్వారంటైన్ నాలుగు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం. మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్ జిమ్ స్టేడియంను మాత్రమే ఉపయోగించడం. బీ.సీ.సీ.ఐ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు మమ్మల్ని వీరు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు” అని ప్రీతీ జింటా అన్నారు.